🕉️ శ్రీ మణికంఠుని చరితం – భాగం 1
🕉️ ☘️ 🕉️ ☘️ 🕉️ ☘️ 🕉️
అది పవిత్ర కార్తీకమాసం!
నైమిశారణ్యంలో ప్రశాంత వాతావరణంలో కార్తీక దీపోత్సవం జరుగుతున్నది.
ఆశ్రమాల ముందు వెలిగించిన దీపాల కాంతులతో పరిసరాలన్నీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఒకవైపు పరమశివునికి పంచామృతాభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు; మరోవైపు మహావిష్ణువుకు పద్మాలతో లక్షపుష్పార్చనలు; ఇంకోవైపు శక్తిమాతకు కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.
ఆ సమయంలో అక్కడికి సూతమహర్షి రావడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆయనను గౌరవపూర్వకంగా ఆహ్వానించి ఆసనం సమర్పించారు.
‘‘ఆహా! ఇక్కడి భక్తిమయమైన వాతావరణం నా మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తోంది. శౌనకాది మునులారా! శివకేశవులకు, శక్తిమాతకు ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో మీరు చేస్తున్న ఆరాధనలు, దీపోత్సవాలు భూలోకానికి శుభఫలితాలను అందిస్తాయి.’’
మునులు వినయంగా నమస్కరించి ఇలా అన్నారు...
‘‘మహర్షీ! ఈ పవిత్ర కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్న కాలంలో స్నానాలు, దానాలు, తులసీపూజ, గోపూజ, అన్నదానాలు, కార్తీక పురాణ పారాయణం చేస్తున్నాము.’’
వారి మాటలు విని సూతమహర్షి ఆనందంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు...
‘‘మంచి పనులు చేస్తూ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. ఇంకో రెండు రోజుల తర్వాత వృశ్చిక సంక్రమణం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే హరిహరపుత్రుడు ధర్మశాస్త్రుడు, మణికంఠ స్వామి ప్రత్యేక ఆరాధన ప్రారంభమవుతుంది.’’
అప్పుడు మునులందరూ ఏకకంఠంతో ఇలా ప్రార్థించారు...
‘‘మహర్షీ! హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అవతార రహస్యాన్ని, మహిషిని సంహరించిన మహిమను మీ నోట వివరంగా వినాలని కోరుకుంటున్నాము.’’
అందుకు సూతమహర్షి చిరునవ్వుతో...
‘‘అలాగే! తప్పకుండా వినిపిస్తాను.’’
🙏🙏🙏
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️