ఇటీవల కాలంలో తరచుగా భర్తలను భార్యలు, భార్యలను భర్తలు చంపడం కలకలం సృష్టిస్తోంది. కుటుంబకలహాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు వంటివి భాగస్వాముల ప్రాణాలను తీస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లయిన పిల్లలు ఉన్నా.. ఇతరులపై వ్యామోహంతో కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. ఈ క్రమంలో కడుపున పుట్టిన అభంశుభం తెలియని పిల్లలను రోడ్డుపైకి తెస్తున్నారు. భర్తను భార్య చంపడమో, భార్యను భర్త చంపడమో చేస్తూ జైలు పాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్తో కలిసి భర్త హరిచరణ్ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియడంతో 5 రోజుల క్రితం టవల్తో గొంతు నులిమి హతమార్చింది. అనంతరం హరిచరణ్ మూర్ఛ వచ్చి చనిపోయాడని బంధువులను, గ్రామస్తులను నమ్మించింది. తల్లిపై అనుమానంతో కుమారుడు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిజానిజాలను రాబట్టి నాగలక్ష్మిని ఆమె ప్రియుడు మహేష్ను అరెస్ట్ చేశారు.
