భారతదేశం బయట ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలు
భారతదేశం హిందూ దేవాలయాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటి వైభవాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వెళ్తుంటారు.
అంగ్కోర్ వాట్ ఆలయం – కాంబోడియా
ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయంగా ప్రసిద్ధి చెందిన అంగ్కోర్ వాట్ కాంబోడియాలో ఉంది. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇందులో 100కు పైగా రాతి ఆలయాలు మరియు 70కు పైగా స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఈ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు లభించింది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం – మలేషియా
మలేషియాలోని బటు గుహల వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వామి విగ్రహం 42.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల మధ్యలో ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. 1890లలో మలేషియాలో స్థిరపడిన హిందువులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ప్రంబనన్ ఆలయం – ఇండోనేసియా
ఇండోనేసియాలోని యోగ్యకర్త ప్రాంతంలో ఉన్న ప్రంబనన్ ఆలయం బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు అంకితమైన త్రిమూర్తి దేవాలయం. ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించింది.
పశుపతినాథ్ ఆలయం – నేపాల్
నేపాల్ రాజధాని ఖాట్మాండులోని భాగమతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ పరమశివుడు పశుపతినాథ్ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం.
తనాహ్ లాట్ ఆలయం – ఇండోనేసియా
ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో సముద్ర తీరంలో ఉన్న తనాహ్ లాట్ ఆలయం ఎంతో అందమైన ప్రదేశంలో నిర్మించబడింది. బాలి ప్రాంతంలో ఉన్న ఏడు సముద్ర తీర దేవాలయాల్లో ఇది ఒకటి. సూర్యాస్తమయం సమయంలో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.
స్వామి నారాయణ్ మందిర్ – లండన్
లండన్లో నిర్మించబడిన స్వామి నారాయణ్ మందిర్ యూరప్లోని అతిపెద్ద హిందూ ఆలయాలలో ఒకటి. ఇక్కడ స్వామి నారాయణుడిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలాంటి ఆలయాలు యూఏఈలోని అబుదాబి మరియు అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా నిర్మించబడ్డాయి.
శ్రీ శివ విష్ణు దేవాలయం – ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఉన్న శ్రీ శివ విష్ణు ఆలయంలో శివుడు మరియు విష్ణుమూర్తి ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించబడ్డారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు.
స్వామి నారాయణ్ అక్షర్ధామ్ – అమెరికా
అమెరికాలోని న్యూజెర్సీలో సుమారు 185 ఎకరాల విస్తీర్ణంలో స్వామి నారాయణ్ అక్షర్ధామ్ ఆలయం నిర్మించబడింది. ప్రధాన దేవాలయం చుట్టూ కమ్యూనిటీ సెంటర్ మరియు సాంస్కృతిక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
శ్రీ కాళీ దేవాలయం – మయన్మార్
మయన్మార్లో 1871లో యాంగోన్ ప్రాంతంలో శ్రీ కాళీ దేవాలయాన్ని నిర్మించారు. బ్రిటీష్ కాలంలో అక్కడికి వలస వచ్చిన తమిళులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
బెసకీ ఆలయం – ఇండోనేసియా
ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో అగుంగ్ పర్వత ప్రాంతంలో ఉన్న బెసకీ ఆలయం అక్కడి అతిపెద్ద మరియు అత్యంత ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు త్రిమూర్తిగా కొలువై ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 23 ఆలయాలు ఉన్నాయి.